వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు, ఈసీఎఎన్ ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు, ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష లేకుండ రెగ్యులర్ చేయాలని మెడికల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎ.యాదగిరి డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం సూపర్డెంట్ శ్రీవాణికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని వీడడం లేదన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎం అందర్నీ డైరెక్ట్ గా రెగ్యులర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకుండా మొండిగా రాత పరీక్ష ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తామని అంటున్నదన్నారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో 1520 పోస్టులు ప్రకటించి యూనియన్లతో చర్చల అనంతరం 400 పైచిలుకు పోస్టులు పెంచిందన్నారు. గతంలో లేని పోస్టులు చర్చల అనంతరం ఎలా పెరిగాయని ప్రశ్నించారు. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన సబ్ సెంటర్ ప్రాతిపదికన లెక్కలు తీస్తే ఏఎన్ఎం పోస్టులు పెరగడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ఏఎన్ఎం లందరినీ రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా రాత పరీక్ష ద్వారానే పోస్టుల్ని నింపుతామని కూర్చోవడం మూలంగా రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు నష్టపోతారని అన్నారు. రాత పరీక్ష అంటే కొత్తగా వచ్చిన విద్యార్థులతో వీరి పోటీ పడడమే, దీనివల్ల వీరికి నష్టం జరుగుతుంది. ఇదే వైద్య ఆరోగ్యశాఖలో గతంలో పారామెడికల్ సిబ్బందిని మరియు మెడికల్ ఆఫీసర్లను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేసినప్పటికీ ఏఎన్ఎంల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి ఎందుకు అవలంబిస్తున్నదని నిలదీశారు.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా కాంట్రాక్ట్ ఏఎన్ఎం లందరిని రెగ్యులర్ చేయాలనిడిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు మాధవి, సంపూర్ణ, దీపిక విజయ, కళ్యాణి, శ్రావణి పద్మ, తదితరులు పాల్గొన్నారు.