అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. కీలకమైన ఈ మూడింటి సమ్మళితమైన విధానం కొనసాగించడమే తెలంగాణ మాడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ పోటీ ఇప్పుడు దేశంలోని ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నగరాలతో కాదని, న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ అని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన IndiaTodayConclave25 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రానిది టెస్ట్ మ్యాచ్ మాడల్ అయితే, తెలంగాణది ట్వంటీ ట్వంటీ మాడల్ అని అభివర్ణించారు.
ఉచిత పథకాల అంశంపై స్పందిస్తూ ఫ్రీ స్కీమ్స్ పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు రూ.70 వేల కోట్ల అప్పు ఉంటే కేసీఆర్ వచ్చాక అది రూ. 7 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మేము గ్యారెంటీలు ఇచ్చినప్పుడు రాష్ట్రానికి ఇంత అప్పు ఉందని తెలియదు. కుర్చీపై ఎక్కాక అసలు విషయం తెలిసింది. నెలకు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తే అందులో రూ.13 వేల కోట్లు జీతాలు, అప్పులు చెల్లించడానికే సరిపోతుందన్నారు.
మహాకుంభమేళకు వెళ్లకపోవడంపై స్పందింస్తూ తన కుటుంబం వెళ్లిందన్నారు. తనకు భద్రచలంలో ఉన్న రాముడిపై విశ్వాసం ఉంది. అక్కడికి రావాలని ఆహ్వానిస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా ఇప్పటి వరకు రాలేదన్నారు. ఇంకా అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానంగా… 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయస్థాయి అత్యంత అద్భుతమైన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. అయిదు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరాన్ని చూడండి. హైదరాబాద్ నగరాన్ని ముంబై, బెంగుళూరు, ఢిల్లీతో పోల్చుకోవడం లేదు. న్యూయార్క్, సియోల్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్నాం. తెలంగాణ మాడల్తో ఎవరూ పోటీ పడలేరు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్కరోజులో సాధ్యమైంది కాదు. కుతుబ్ షాహీ కాలం నుంచి ఈ నగరానికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు.
పెట్టుబడుల విషయంలో గుజరాత్ తరహాలోనే దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మిగతా రాష్ట్రాలకు కూడా రాయితీలు ప్రకటించాలి. రాష్ట్ర ప్రజలు మాపై నమ్మకం ఉంచినందున రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అడగటం మా బాధ్యత. తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పులున్నాయి. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 69 కోట్లు మాత్రమే అప్పులుండేవి. ప్రస్తుతం తెలంగాణ ఆదాయం నెలకు 18,500 కోట్లు మాత్రమే. జీతాలకు, అప్పులపై అసలు వడ్డీలకే 13 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కనీసం నెలకు 500 కోట్లు కేటాయించలేని పరిస్థితులున్నాయి. ఇలాంటి అంశాలపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
2026 లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడానికి ముందు అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. దీనిపై ముందు చర్చ జరగాలి. రాజకీయ కోణంలో దక్షిణాదికి నష్టం జరిగే నిర్ణయాలు సరికాదు. దేశంలో కులగణన ఎందుకు జరగకూడదు. అందులో తప్పేముంది. బీసీల జనాభాను ఎందుకు లెక్కించకూడదు. ఎస్సీ, ఎస్టీ లెక్కలు తేల్చినట్టుగానే బీసీల గణాంకాలు సేకరించడంలో ఇబ్బందేంటి. వారి డిమాండ్ సమంజసమైనప్పుడు బీసీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో తప్పేముంది. ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదన్నారు.
హిందీ నేర్చుకోవడమన్నది ఒక ఐచ్చికంగా మాత్రమే ఉండాలి. బలవంతంగా రుద్దకూడదు. కాలేజీల్లో ఫ్రెంచ్, జర్మనీ వంటి ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరికి ఏదిష్టముంటే దాన్ని నేర్చుకుంటారు. హిందీని నేర్చుకోవడాన్ని వ్యతిరేకించడం లేదు. బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించవద్దనేదే మా అభిప్రాయం. హిందీ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందంటే నేర్చుకుంటారని చెప్పారు.
హైదరాబాద్ వేదికగా ఒలంపిక్ క్రీడలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీ గారికి విజ్ఞప్తి చేశాం. క్రీడలకు హైదరాబాద్ ఒక మంచి కేంద్రం. ప్రపంచ మిలటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ హైదరాబాద్లో నిర్వహించాం. ఎంతో మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు తెలంగాణ నుంచి ఉన్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్లలో ఏది ఉత్తమమైన నగరమో అంతర్జాతీయ ఒలింపిక్ అసోషియేషన్ నిర్ణయించాలన్నారు.